విరాట్ కోహ్లికి జరిమానా
సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి జరిమానా పడింది. సోమవారం మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో భాగంగా అవుట్ ఫీల్డ్ గురించి పదేపదే అంపైర్ మైకేల్ గాఫ్కు ఫిర్యాదు చేసిన కోహ్లి.. తన అసంతృప్తిని బాహాబాటంగా వ్యక్తం చేసి బంతిని బలంగా నేలకు కొట్టాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నియమావళికి విరుద్దం కావడంతో కోహ్లికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది.
సఫారీలు రెండో ఇన్నింగ్స్ 25 ఓవర్లో అంపైర్ గాఫ్ వద్దకు వెళ్లిన కోహ్లి అవుట్ ఫీల్డ్ గురించి ఫిర్యాదు చేశాడు. వర్షం వెలిసిన తరువాత మ్యాచ్ జరిగే క్రమంలో అవుట్ ఫీల్డ్ బాలేదని, దాని ప్రభావం బంతిపై తీవ్రంగా పడుతుందని అంపైర్ గాఫ్కు విజ్ఞప్తి చేశాడు. అయితే కోహ్లి నిర్ణయంతో అంపైర్ ఏకీభవించలేదు. దాంతో బంతిని నేలకు కొట్టిన కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై తాను తప్పుచేసినట్లు మ్యాచ్ తరువాత కోహ్లి అంగీకరించడంతో కేవలం 25 శాతం జరిమానాతోనే సరిపెడుతున్నట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పేర్కొన్నారు. అదే క్రమంలో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా జత చేశారు. అయితే అంపైర్ నిర్ణయంతో విభేదించడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు కోహ్లి ఒప్పుకోవడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఈ సందర్భంగా బ్రాడ్ తెలిపారు.
మరిన్ని వార్తలు