'కోహ్లి సేనపై విమర్శలు ఆపండి'
న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్ల్లో విజయాల తర్వాత సిరీస్ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టుకు అభిమానులు బాసటగా నిలవాలని సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డ విరాట్ సేనకు అంతా అండగా ఉండాలన్నాడు. దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైన టీమిండియా.. సిరీస్ను ఇంకో మ్యాచ్ ఉండగానే కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ గంభీర్ స్పందించాడు. 'భారత జట్టుకు మద్దతుగా నిలవాల్సిన సమయమిది. విమర్శలు చేయడం తగదు. ఇదే జట్టు గతంలో ఎన్నో మరపురాని విజయాలు అందించింది. రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించలేనంత మాత్రాన విమర్శల పాలు చేయడం సరికాదు. మన వాళ్లను విమర్శించడం ఆపండి. అదే సమయంలో ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారో వారిని కొనియాడండి. అంతేకానీ ఓటమి పాలైన టీమిండియాపై విమర్శలు చేయకుండా మద్దతుగా నిలవండి' అని గంభీర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విన్నవించాడు.