కోహ్లి ఒక్కడే  కప్‌ గెలిపించలేడు! 

Virat Kohli alone can not win World Cup: Sachin Tendulkar - Sakshi

మిగతా వారూ బాగా ఆడాల్సిందే

నాలుగో స్థానం సమస్యే కాదు 

సచిన్‌ టెండూల్కర్‌ విశ్లేషణ  

న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ జట్టు విజయాల్లో కోహ్లి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచినీళ్లప్రాయంగా పరుగుల వరద పారిస్తూ రికార్డులు కొల్లగొడుతూ కోహ్లి టీమిండియాను నడిపించాడు. అయితే కోహ్లి ఎంత అద్భుత ఆటగాడైనా ఇతర సభ్యుల సహకారం లేకపోతే ఈ వరల్డ్‌ కప్‌లో గెలవడం కష్టమని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. 1996, 1999, 2003 ప్రపంచకప్‌లలో తాను భారత జట్టు భారం మోసిన విధంగానే ఇప్పుడు అంతా కోహ్లిపైనే ఆధారపడి ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ సచిన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఎప్పుడైనా ప్రతీ మ్యాచ్‌లో ఒకరో, ఇద్దరు రాణించడం సహజమే. అయితే వారికి ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. అది కోహ్లి అయినా సరే. ఒక ఆటగాడి వల్ల వరల్డ్‌ కప్‌లాంటి టోర్నమెంట్‌ గెలవడం సాధ్యం కాదు. ఆ అవకాశమే లేదు. కీలక సమయాల్లో ఇతరులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అది జరగలేదంటే ఫలితం చాలా నిరాశాజనకంగా ఉంటుంది’అని సచిన్‌ విశ్లేషించాడు. భారత జట్టు కూర్పులో నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి విషయంలో స్పష్టత లేకపోవడాన్ని సచిన్‌ తేలిగ్గా తీసుకున్నాడు. అది అసలు సమస్యే కాదని అతను అన్నాడు. ‘నా దృష్టిలో నాలుగో స్థానం అనేది ఒక అంకె మాత్రమే. అవసరాన్ని, మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఆ స్థానంలో ఎవరినైనా ఆడించుకోవచ్చు. మన వద్ద కావాల్సిన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. వారందరికీ 4, 6, 8 ...ఇలా ఎక్కడ ఆడితే ఎలా ఆడాలనేది బాగా తెలుసు. కేవలం అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవడం మాత్రమే ముఖ్యం’అని సచిన్‌ అభిప్రాయ పడ్డాడు. 8–10 ఏళ్ల అనుభవం ఉన్నవారితో పాటు కుర్రాళ్లు కూడా ఉండటంతో మన జట్టు సమతూకంగా కనిపిస్తోందని, టైటిల్‌ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నాడు.  

బౌలర్లకు కష్టాలే!  
వన్డేల్లో మారిన నిబంధనలు ఆటను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశాయని, 350 పరుగుల లక్ష్యాన్ని కూడా 45 ఓవర్లలోనే జట్లు ఛేదిస్తున్నాయన్న మాస్టర్‌... ఇటీవలి ఇంగ్లండ్, పాకిస్తాన్‌ సిరీస్‌ను ఉదహరించాడు. ‘బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లతో పాటు రెండు వైపుల నుంచి రెండు కొత్త బంతుల నిబంధనను ప్రవేశపెట్టడంతో బౌలర్ల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. రెండు బంతుల వల్ల బంతి చివరి వరకు గట్టిగా ఉండటం వల్ల రివర్స్‌ స్వింగ్‌కు ఆస్కారమే లేకుండా పోయింది. అసలు వన్డేల్లో రివర్స్‌ స్వింగ్‌ చూసి ఎన్నాళ్లయింది. మేం ఆడినప్పుడు 28–30 ఓవర్ల సమయంలో బంతి రివర్స్‌ స్వింగ్‌ అయ్యేది. డెత్‌ ఓవర్లలో మరింతగా మెత్త పడిపోయేది. ఆడటం బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారేది. దీని కోసం ఏదో ఒకటి చేయాలి. పాత తరహా ఒకే బంతి వాడాలి. లేదా బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు రూపొందించాలి’అని సచిన్‌ తెలిపాడు. 

వారు కూల్చేయగలరు!  
‘ప్రపంచ కప్‌లో మణికట్టు స్పిన్నర్లు రాణిస్తారనే నమ్మకముంది. మన జట్టులో కుల్దీప్, చహల్‌ ఉన్నారు. ఇటీవల మన దేశంలో ఆస్ట్రేలియా వీరిని సమర్థంగా ఎదుర్కొన్నా దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా విశ్లేషణ ప్రకారం ఇలాంటి బౌలర్లను బాగా అర్థం చేసుకున్న తర్వాత కూడా తప్పులు చేసి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు సమర్పించుకుంటారు. నేను ఆడినప్పుడు మురళీధరన్‌ బౌలింగ్‌ చూస్తే అతను సాంప్రదాయ ఆఫ్‌ స్పిన్‌తో పాటు దూస్రా మాత్రమే వేసేవాడు. అతని బౌలింగ్‌ అందరికీ అర్థమైపోయింది. అయినా సరే మురళీ భారీగా వికెట్లు పడగొట్టగలిగాడు. బంతిని సరిగ్గా అంచనా వేయడంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ కూడా పొరపాట్లు చేస్తారు. కాబట్టి ఇంగ్లండ్‌లో మన ఇద్దరు స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు’   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top