రెండు రోజుల ముందుగా లంకలో ముక్కోణపు సిరీస్
మార్చి 6 నుంచే ఇండిపెండెన్స్ కప్
న్యూఢిల్లీ: శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించనున్న ‘ఇండిపెండెన్స్ కప్’ ముక్కోణపు టి20 సిరీస్ షెడ్యూల్ను కాస్త ముందుకు జరిపారు. తొలుత అనుకున్నట్లు మార్చి 8 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఈ సిరీస్ను రెండు రోజుల ముందుగా... 6 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. ఆతిథ్య లంకతో పాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇందులో పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఒక జట్టు రెండేసి మార్లు ప్రత్యర్థితో తలపడుతుంది. తొలి మ్యాచ్ 6న భారత్, లంకల మధ్య జరుగుతుంది. మ్యాచ్లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే నిర్వహిస్తారు. భారత్లో టీవీ ప్రసార హక్కుల్ని డిస్కవరీ కమ్యూనికేషన్స్కు చెందిన ‘డిస్పోర్ట్’ చానెల్ చేజిక్కించుకుంది.