ఆ మ్యాచ్ గుర్తొచ్చింది: రోహిత్ శర్మ
ఇండోర్: ఐపీఎల్-10లో జోరు కొనసాగిస్తామని ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్తో గురువారం జరిగిన మ్యాచ్లో భారీ విజయం సాధించడం పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ 2014లో రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ ను గుర్తు చేసిందని తెలిపాడు. అప్పుడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ టీమ్ పై 190 పరుగుల టార్గెట్ ను 14 ఓవర్లలో ఛేదించామని గుర్తు చేశాడు.
పార్థీవ్ పటేల్, జోస్ బట్లర్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారని ప్రశంసించాడు. పార్థీవ్ చాలా ఆత్మవిశ్వాసంతో ఆడాడని, భారీ లక్ష్యాన్ని చేధించడానికి తమకు శుభారంభం లభించిందని చెప్పాడు. బట్లర్ ఆటపై పూర్తి సంతృప్తితో ఉన్నానని అన్నాడు. సెంచరీ వీరుడు హషీమ్ ఆమ్లాపై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు. ఆమ్లా, మ్యాక్స్ వెల్ ఇద్దరూ బాగా ఆడారని మెచ్చుకున్నాడు.
ముంబై విజయంతో తన వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉందని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న బట్లర్ వ్యాఖ్యానించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం గర్వంగా ఉందన్నాడు. బరిలోకి దిగినప్పుడు ఒత్తిడికి గురయ్యానని, తాము గెలవడంతో ఇప్పుడు హాయిగా ఉందని చెప్పాడు.
సంబంధిత వార్తలు