ముగిసిన కార్పొరేట్ స్నూకర్, పూల్ టోర్నీ
రాయదుర్గం, న్యూస్లైన్: హైదరాబాద్ కార్పొరేట్ ఒలింపిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్నూకర్, పూల్ టోర్నీ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో 24 ఐటీ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఖాజాగూడలోని ఆంధ్రప్రదేశ్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన స్నూకర్ సింగిల్స్ పోటీలో హెచ్ఎస్బీసీ ఈడీపీకి చెందిన అజయ్ దోగిపర్తి 3-2 స్కోరుతో క్లింక్ సాఫ్ట్వేర్ ఉద్యోగి వినోద్కుమార్పై విజయం సాధించారు.
డబుల్స్ పోటీలో అజయ్ దొగిపర్తి, అబ్దుల్ గాజి(హెచ్ఎస్బీసీ-ఈడీపీ) జంట 2-1 స్కోరుతో ఒరాకిల్కు చెందిన సుశీల్ వెల్లంకి, రవి జంటపై గెలుపొందారు. అదేవిధంగా పూల్ సింగిల్స్ పోటీలో సుశీల్ వెల్లంకి(ఒరాకిల్) 4-2 స్కోరుతో రాంప్రకాశ్ గణేషన్ (సీఏ టెక్నాలజీ)పై గెలుపొందారు. అదేవిధంగా డబుల్స్ పోటీలో ఆరం ప్రకాశ్ గణేషన్, జీవీఎన్ అనిల్ కుమార్ (సీఏటెక్నాలజీ) 4-2 స్కోరుతో సుశీల్ వెల్లంకి, మహేష్(ఒరాకిల్) జంటపై గెలుపొందారు.