ఇషిత రాజుకు రజతం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఇషిత రాజు మెరిసింది. మంగోలియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో ఇషిత రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని సాధించింది. ఉలాన్బాటర్లో ఈనెల 21 నుంచి 24 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల ఇషిత 12–21, 13–21తో టాప్సీడ్ పూర్వ బర్వే (భారత్) చేతిలో పరాజయం పాలైంది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రెండోసీడ్ ఇషిత 21–13, 14–21, 21–13తో సరారత్ చుబొకా (థాయ్లాండ్)పై, క్వార్టర్స్లో 21–3, 21–1తో ఉయాంగ జజార్గల్పై విజయం సాధించింది. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 ర్యాంకుల్లో ఇషిత... తన కెరీర్లోనే అత్యుత్తమంగా 20వ ర్యాంకును సాధించింది. ఆమె ఇండోనేసియా కోచ్ యూసుఫ్ జుహారీ ఆధ్వర్యంలో సుచిత్ర అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
మరిన్ని వార్తలు