పట్టు బిగిస్తున్న దక్షిణాఫ్రికా
రెండో ఇన్నింగ్స్లో 126/4
శ్రీలంకతో తొలి టెస్టు
డర్బన్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (35), మర్క్రమ్ (28), ఆమ్లా (16), బవుమా (3) ఔట్ కాగా... కెప్టెన్ డు ప్లెసిస్ (25 బ్యాటింగ్), డికాక్ (15 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కలుపుకొని దక్షిణాఫ్రికా ప్రస్తుతం 170 పరుగులు ముందంజలో ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న ఆ జట్టు మూడో రోజు మరిన్ని పరుగులు సాధిస్తే లంకకు కష్టాలు తప్పవు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 49/1తో ఆట కొనసాగించిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరీరా (51) అర్ధ సెంచరీ సాధించగా... కరుణరత్నే (30), అంబుల్దేనియా (24), ధనంజయ డి సిల్వ (23) కొంత పోరాడారు. డేల్ స్టెయిన్ (4/48) ప్రత్యర్థి వెన్ను విరవగా, ఫిలాండర్, రబడ చెరో 2 వికెట్లు తీశారు.
సంబంధిత వార్తలు