లంకకూ స్పిన్‌ దెబ్బ

Sri Lanka recover late on from Ajaz Patel is fifer - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 227/7

ఎజాజ్‌ పటేల్‌కు 5 వికెట్లు

గాలే: శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టును బౌలర్లు శాసిస్తున్నారు. తొలిరోజు కివీస్‌ మెడకు స్పిన్‌ ఉచ్చు బిగించిన శ్రీలంక రెండో రోజు అదే ఉచ్చులో చిక్కుకుంది. దీంతో గురువారం ఆటలో 12 వికెట్లు నేలకూలాయి. 203/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభమైన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 83.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ముగిసింది. తొలి సెషన్‌లో లంక పేసర్‌ లక్మల్‌ (4/29) విజృంభించాడు. దీంతో కేవలం 46 పరుగులే జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. రాస్‌ టేలర్‌ (86; 6 ఫోర్లు)  ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్దే నిష్క్రమించాడు. టెయిలెండర్లు సౌతీ 14, బౌల్ట్‌ 18 పరుగులు చేశారు.

తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక... ఎజాజ్‌ పటేల్‌ (5/76) దెబ్బకు  80 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు తిరిమన్నె (10), కరుణరత్నే (39; 4 ఫోర్లు) విఫలమవడంతో 66 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. కుశాల్‌ మెండిస్‌ (53; 7 ఫోర్లు, 1 సిక్స్‌), మాథ్యూస్‌ (50; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడటంతో జట్టు స్కోరు 2 వికెట్లకు 143 పరుగులకు చేరింది. ఎజాజ్‌ తిప్పేయడంతో 18 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 161 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన లంకను  వికెట్‌ కీపర్‌ డిక్‌వెలా (39 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), లక్మల్‌ (28 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకున్నారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ప్రస్తుతం లంక మరో 22 పరుగులు వెనుకబడి ఉంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top