ధావన్ హాఫ్ సెంచరీ.. దూసుకెళ్తున్న భారత్
ఫుణే : న్యూజిలాండ్ తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. అంతకుముందు 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ అతి జాగ్రత్తగకు పోవడంతో తొలి ఓవర్ మెయిడిన్ అయింది. రెండో వన్డేలోనూ రోహిత్ విఫలమయ్యాడు. సౌధీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మూడో బంతిని రోహిత్ ఆడగా, ఫీల్డర్ మున్రో క్యాచ్ పట్టడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
ఆపై క్రీజులోకొచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 29: 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలుత వేగంగా ఆడినా అనంతరం నెమ్మదించాడు. కివీస్ ఆల్ రౌండర్ డి గ్రాండ్ హోమ్మి వేసిన బంతిని ఆడగా అది వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దినేశ్ కార్తీక్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించిన ధావన్ ఓ సాధారణ షాట్ ఆడి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో కివీస్ పేసర్ మిల్నే బంతిని ఆడిన ధావన్ (84 బంతుల్లో 68: 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాస్ టేలర్ చితికి చిక్కాడు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్ , హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు.