శార్దూల్కు ఆకస్మిక పిలుపు
న్యూఢిల్లీ: ముంబై జట్టుకు ప్రాతినిథ్య వహిస్తున్న పేసర్ శార్దూల్ ఠాకూర్కు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టులో కలవాల్సిందిగా పిలుపువచ్చింది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నీలో బిజీగా ఉన్న శార్దూల్కు అనూహ్యంగా పిలుపు వచ్చిన విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సీఏ) తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్(బీసీసీఐ) నుంచి తమకు సమాచారం అందినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా దేశవాళీ మ్యాచ్లు ఆడుతున్న శార్దూల్ను ముంబై జట్టు నుంచి విడుదల చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శార్దూల్ ఈ రోజు(శుక్రవారం) రాత్రి జొహనెస్బర్గ్ బయల్దేరే అవకాశం ఉంది.
మరి శార్దూల్ను ఉన్నపళంగా పిలవడానికి చివరి టెస్టు మ్యాచ్లో అవకాశం కల్పించేందుకా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే జట్టులో శార్దూల్ను ఎంపిక చేసినప్పటికీ ముందుగా పిలుపు రావడంపైనే ఆసక్తిని పెంచుతుంది. ఈ నెల 24న ధోనీతో పాటు మరికొందరు ఆటగాళ్లు వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళుతున్నారు. ఇప్పటికే భారత్ జట్టుతో ఐదుగురు పేసర్లు అందుబాటులో ఉన్నప్పటికీ శార్దూల్కు ఆకస్మిక పిలుపు ఎందుకునేది ప్రశ్నార్థకంగా మారింది. భారత జట్టు తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడిన శార్దూల్.. టెస్టుల్లో ఇంకా అరంగేట్రం చేయాల్సి ఉంది.