ఆసీస్తో రెండో టెస్టు: షమీ విజృంభణ
పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ విజృంభించాడు. సోమవారం నాల్గో రోజు ఆటలో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు సాధించి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. టిమ్ పైన్(37), అరోన్ ఫించ్(25), ఉస్మాన్ ఖవాజా(72)లను కొద్ది పాటి వ్యవధిలోనే పెవిలియన్కు పంపాడు. పైన్, ఫించ్లను వరుస బంతుల్లో ఔట్ చేసిన షమీ.. మరో మూడు ఓవర్లలోపే ఖవాజాకు షాకిచ్చాడు. అటు తర్వాత బూమ్రా బౌలింగ్లో కమిన్స్(1) ఔట్ కావడంతో ఆసీస్ 198 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ను నష్టపోయింది. 192 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్.. 198 పరుగుల వద్ద మరో రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఆసీస్ ఆరు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోవడంతో టీమిండియాకు మ్యాచ్పై పట్టుచిక్కింది.
132/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ నిలకడగా ఆడే యత్నం చేసింది. పరుగులు మాటను పక్కను పెట్టి టీమిండియా బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే లంచ్ సమయం వరకూ ఆసీస్ కుదురుగా బ్యాటింగ్ చేసింది. ఆపై మహ్మద్ షమీ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ఆసీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. గుడ్ లెంగ్త్, బౌన్సర్లు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులతో షమీ తన బౌలింగ్లో పదునుచూపించాడు. ఆసీస్ కోల్పోయిన ఎనిమిది వికెట్లలో ఐదు వికెట్లు షమీ సాధించాడు.
సంబంధిత వార్తలు