ఆసీస్కు మరో షాక్
కార్డిఫ్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఇంగ్లండ్నే విజయం వరించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో గెలుపొంది ఆసీస్కు మరో షాకిచ్చింది. ఫలితంగా సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 47.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది.
షాన్ మార్ష్(131;116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆస్టన్ అగర్(46; 42 బంతుల్లో 7 ఫోర్లు)లు రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, ఆదిల్ రషీద్ మూడు వికెట్లతో మెరిశాడు. ఇక మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించగా, మార్క్ వుడ్ వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 342 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్(120; 108 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, బట్లర్( 91 నాటౌట్;70 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. వీరికి జతగా బెయిర్ స్టో(42; 24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
మరిన్ని వార్తలు