రోహిత్‌ ముంగిట మరో వరల్డ్‌ రికార్డు

 Rohit Looks Stay On 400 Sixers Feat - Sakshi

రాజ్‌కోట్‌: వరుస రికార్డులతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ముంగిట ఇప్పుడు మరో వరల్డ్‌ రికార్డు నిలిచింది.  అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రెండు సిక్సర్లు కొడితే భారత్‌ తరఫున నాలుగొందల సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టిస్తాడు. బంగ్లాదేశ్‌తో రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 398 సిక్సర్లతో ఉన్నాడు. ఇక నాగ్‌పూర్ వేదికగా ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో రెండు సిక్సర్లు బాదితే..? ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్న ఓవరాల్‌ మూడో ఆటగాడిగా నిలవనున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ 534 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.  రోహిత్‌ మరో రెండు సిక్సర్లు బాదడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో నాల్గొందల సిక్సర్ల మైలురాయిని అందుకోవడంతో పాటు భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top