రెండో క్రికెటర్‌గా రోహిత్‌..

Rohit becomes Second Cricketer Most ODI 100s against Australia - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే  సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇది ఆసీస్‌పై వన్డేల్లో రోహిత్‌కు 7వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 22వ వన్డే శతకం. రోహిత్‌ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల‍్కర్‌ తొలి స్థానంలో  ఉన్నాడు. ఆసీస్‌పై సచిన్‌ 9వన్డే సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతుల్లో రోహిత్‌ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రోహిత్‌ ఆదుకున్నాడు. ఎంఎస్‌ ధోనితో కలిసి 137 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశాడు. దాంతో టీమిండియా తేరుకుంది.

కాగా, ధోని(51; 96 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) నాల్గో వికెట్‌ ఔటయ్యాడు. అటు తర్వాత దినేశ్‌ కార్తీక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు రోహిత్. అయితే కార్తీక్‌(12) ఔట్‌ కావడంతో భారత జట్టు 176 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా కోల్పోయింది. ఆపై కాసేపటికి రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.  ఈ మ్యాచ్‌లో భారత జట్టు 213 పరుగుల వద్ద జడేజా(8) వికెట్‌ను కోల్పోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top