దక్షిణాఫ్రికా లక్ష్యం 275

Rohit 115 helps India to 274 - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ(115; 126 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లు) సెంచరీకి జతగా, శిఖర్‌ ధావన్‌(34;23 బంతుల్లో 8 ఫోర్లు), విరాట్‌ కోహ్లి(36; 54 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(30; 37 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో భారత్‌ ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌-రోహిత్‌ శర్మలు ధాటిగా ఆరంభించారు. అయితే శిఖర్‌ దావన్‌ దూకుడుగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, రోహిత్‌ శర్మ సమయోచితంగా ఆడి సెంచరీ సాధించాడు.తొలుత క్రీజ్‌లో కుదురుకోవడానికి ప‍్రాధాన్యత ఇచ్చి రోహిత్‌..ఆపై సమయోచితంగా ఆడాడు. మొదటి వికెట్‌కు ధావన్‌తో కలిసి 48 పరుగులు జోడించిన రోహిత్‌.. అటు తర్వాత కోహ్లితో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు.

ఈ క్రమంలోనే ముందుగా 50 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా, కోహ్లి(36) రెండో వికెట్‌గా అవుటైన తర్వాత భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. అనవసరపు పరుగుకోసం రోహిత్‌ ఇచ్చిన సూచనతో ముందుకు వెళ్లిన కోహ్లి రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.ఇక అజింక్యా రహానే(8) కూడా రోహిత్‌ పొరపాటుతో రనౌటయ్యాడు. దాంతో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి మరొకసారి ఇన్నింగ్స్‌ నిర్మించే యత్నం చేస్తున్న రోహిత్‌..ఆ క‍్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్‌ వన్డే కెరీర్‌లో 17వ సెంచరీ.  అయితే రోహిత్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అతన్ని లుంగీ ఎంగిడీ పెవిలియన్‌కు పంపాడు. ఎంగిడీ వేసిన అద్భుతమైన బంతికి కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చిన రోహిత్‌ అవుటయ్యాడు. ఆపై వెంటనే హార్దిక్‌ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లోనే క్లాసెన్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాసేపటికి అయ్యర్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. అదే సమయంలో మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పెరగడంతో భారత్‌ జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. భారీ ఆశలు పెట్టుకున్న ధోని(13) కూడా నిరాశపరిచాడు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌(19 నాటౌట్; 2 ఫోర్లు‌) ఆకట్టుకోవడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్లు కోల్పో​యి 274 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లో లుంగి ఎన్‌గిడి నాలుగు వికెట్లతో రాణించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top