ధోని స్థానాన్ని భర్తీ చేయగలను.. కానీ

Rishabh Pant Says No Chance To Replacing Dhoni In ODIs - Sakshi

ముంబై:  టీమిండియా సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని వారసుడిగా పేర్కొంటున్న యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కెరీర్‌ ఆరంభంలోనే భారత్‌ మిస్టర్‌ 360గా పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. తనదైన స్టైలీష్‌ ఆటతో అభిమానులను అలరిస్తుంటాడు. దీంతో పంత్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. వెస్టిండీస్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మూడు ఫార్మట్లలో చోటు దక్కించుకున్న పంత్‌.. టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణంగా సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

‘ధోని వంటి దిగ్గజ ఆటగాడి స్థానంలో ఆడుతున్న విషయం తెలుసు. కాని దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తే సమస్యలు ఏర్పాడతాయి. ధోని స్థానాన్ని భర్తీ చేయగలను. కానీ ఇప్పుడే కాదు.. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇక అభిమానులు ఏం అనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించను. ప్రస్తుతం నా దృష్టంతా మంచి ప్రదర్శన చేయడం.. ఆటను మెరుగుపరుచుకోవడం. స్టైలీష్‌గా ఆడటం కంటే జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ముఖ్యం. ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాను. తప్పిదాలు చేయడం సహజం.

కానీ పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నాను. ఇక ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు చేయగలను. ప్రస్తుతం నాలుగు స్థానంలోనైనా దిగడానికి సిద్దం. కీపింగ్‌లో మరింత మెరుగుపడాలి. ధోనిని ఎప్పుడు కలిసినా కీపింగ్‌ మెళుకువలపై చర్చిస్తుంటా. టెస్టులతోనే నా ఆటలో పరిణితి చెందిందని భావిస్తున్నా. చిన్ననాటి కోచ్‌ల నుంచి ఇప్పటి ప్రధాన కోచ్‌ల వరకు ఆందరూ నా ఆట మెరుగుపడడానికి, ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన వారే. వారందరికీ రుణపడి ఉంటాను’అంటూ పంత్‌ వివరించాడు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top