అఫ్గాన్ క్లీన్ స్వీప్
చివరి మ్యాచ్లోనూ బంగ్లాకు తప్పని ఓటమి
డెహ్రాడూన్: క్రికెట్ పసికూన అఫ్గానిస్తాన్ అద్భుతం చేసింది. తమకంటే ఎంతో సీనియర్ జట్టును చిత్తుగా ఓడించి 3–0తో సిరీస్ విజయాన్ని అందుకుంది. అఫ్గాన్ జోరుతో బంగ్లాదేశ్కు వైట్వాష్ తప్పలేదు. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన చివరిదైన మూడో టి20లో అఫ్గాన్ ఒక పరుగుతో విజయం సాధించింది. బంగ్లా విజయానికి చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా... 19వ ఓవర్లో ముష్ఫికర్ రహీమ్ (46; 7 ఫోర్లు) వరుసగా ఐదు ఫోర్లు కొట్టి మొత్తం 21 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్లో 9 పరుగులకు మారింది.
ఆ సమయంలో బంతి అందుకున్న రషీద్ ఖాన్ తొలి బంతికే రహీమ్ను ఔట్ చేయడంతో పాటు ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. షెన్వారీ (33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), కెప్టెన్ స్తానిక్జై (27; 3 సిక్స్లు) రాణించారు. అనంతరం బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. మహ్మదుల్లా (45 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చివరి వరకు నిలిచినా లాభం లేకపోయింది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ (1/24), ముజీబ్ (1/25), నబీ (0/20) ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టిపడేశారు.
మరిన్ని వార్తలు