సింధుకు రాహుల్ గాంధీ ప్రశంసాపత్రం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధును ప్రశంసిస్తూ లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కార్యదర్శి అమిర్ జావిద్ సోమవారం ఈ లేఖను సింధుకు అందజేశారు. ఆమె వెంట తండ్రి పీవీ రమణ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా సంతకం చేసిన ఈ లేఖలో ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్తో మీరు ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా చరిత్ర సృష్టించారు.
మీ విజయం మాకందరికీ గర్వకారణం. ఇది మీ వ్యక్తిగత విజయమే అయినా భారత క్రీడాకారులకు ప్రేరణగా నిలిచే ఘనతను మీరు సాధించారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా... ఆటపై ఉన్న అంకితభావం, నిబద్ధతతో వాటన్నిం టిని అధిగమించారు. దేశంలో మరెంతో మంది మహిళలు క్రీడలను కెరీర్గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచిన మీరు కొత్త ఏడాదిలో, టోక్యో ఒలింపిక్స్ (2020)లో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.