స్టార్ క్రీడాకారులకు విశ్రాంతి
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీకి సింధు, శ్రీకాంత్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ లేకుండానే ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్ధమైంది. హాంకాంగ్ వేదికగా నేటి నుంచి జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే 13 మంది సభ్యుల భారత బృందాన్ని బాయ్ (భారత బ్యాడ్మింటన్ సంఘం) ఎంపిక చేసింది. ఈ జట్టుకు హెచ్ఎస్ ప్రణయ్ సారథ్యం వహించనున్నాడు. త్వరలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ కోసం భారత కీలక ఆటగాళ్లు సైనా, సింధు, శ్రీకాంత్లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చారు.
ఈ నేపథ్యంలో తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు యువ ఆటగాళ్లకు మంచి అవకాశం దొరికినట్లయింది. మహిళల విభాగంలో అష్మితా చలిహా, వైష్ణవి భాలే, శిఖా గౌతమ్, అశ్విని భట్, రుతపర్ణా పాండ, ఆరతి సారా సునీల్, మిథులా... పురుషుల కేటగిరీలో హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ, ఎంఆర్ అర్జున్, శ్లోక్ రామచంద్రన్, అరుణ్ జార్జ్, సన్యం శుక్లా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అస్సాంకు చెందిన 19 ఏళ్ల అష్మిత మహిళల జట్టును నడిపించనుంది. ఆరు రోజుల పాటు, మొత్తం 11 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరించారు. చైనీస్ తైపీ, సింగపూర్లతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘బి’లో చోటు దక్కించుకుంది. లీగ్ మ్యాచ్ల అనంతరం ప్రతీ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. గతేడాది థాయ్లాండ్ వేదికగా జరిగిన ఇదే టోర్నీలో భారత్ క్వార్టర్స్లో థాయ్లాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
జట్టు వివరాలు
పురుషులు: హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ, ఎంఆర్ అర్జున్, శ్లోక్ రామచంద్రన్, అరుణ్ జార్జ్, సన్యం శుక్లా.
మహిళలు: అష్మితా చలిహా, వైష్ణవి భాలే, శిఖా గౌతమ్, అశ్విని భట్, రుతపర్ణ పాండ, ఆరతి సారా సునీల్, మిథులా.