పృథ్వీ షా మరో సెంచరీ

Prithvi Shaw is another century - Sakshi

ముంబై 248/6  

సాక్షి, ఒంగోలు: ముంబై యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా (173 బంతుల్లో 114; 14 ఫోర్లు, 1 సిక్స్‌) రంజీ ట్రోఫీలో మళ్లీ సెంచరీతో చెలరేగాడు. షా సెంచరీకి తోడు సిద్ధేశ్‌ లాడ్‌ (86) కూడా రాణించడంతో శుక్రవారం ఆంధ్రతో ప్రారంభమైన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ రంజీ సీజన్‌లో పృథ్వీ షాకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 64 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో పృథ్వీ, లాడ్‌ కలిసి ముంబై జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 125 పరుగులు జోడించగా, శ్రేయస్‌ అయ్యర్‌ (0) విఫలమయ్యాడు. ఆంధ్రా బౌలర్లలో అయ్యప్పకు 3 వికెట్లు దక్కాయి.  

హైదరాబాద్‌ 289/8
గువహటిలోని బర్సాపర స్టేడియంలో అస్సాంతో జరుగుతున్న గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి రోజు 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కెప్టెన్‌ అంబటి రాయుడు (83), బావనక సందీప్‌ (84) అర్ధ సెంచరీలతో రాణించారు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను రాయుడు, సందీప్‌ ఐదో వికెట్‌కు 157 పరుగులు జోడించి ఆదుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top