టైటిల్‌కు మరింత చేరువలో ప్రీతి

Preeti Kongara Close To Win Regatta Title - Sakshi

మాన్‌సూన్‌ రెగట్టా చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: మాన్‌సూన్‌ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌కు చెందిన ప్రీతి కొంగర టైటిల్‌కు మరింత చేరువైంది. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో శనివారం మూడు రేసులు జరుగగా ప్రీతి తొలి రేసులో విజేతగా నిలిచింది. మిగతా రెండు రేసుల్ని వరుసగా 8వ, 4వ స్థానంతో ముగించింది.  ప్రస్తుతం బాలికల మెయిన్‌ ఫ్లీట్‌ ఈవెంట్‌లో ప్రీతి కొంగర 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... రెండో స్థానంలో ఉన్న రితిక డాంగి (ఎస్‌ఎస్‌ఎస్‌ భోపా ల్‌) ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి.

వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం 32 పాయింట్లు ఉండటం విశేషం. ఉమా చౌహాన్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌ భోపాల్‌; 66 పాయింట్లు) మూడోస్థానంలో నిలిచింది. ఆదివారం మరో మూడు రేసులు జరగనున్నాయి. ఇందులోనూ సత్తా చాటితే ట్రోఫీ ప్రీతి సొంతం కానుంది. బాలుర కేటగిరీలో తృష్ణ సెయిలింగ్‌ క్లబ్‌కు చెందిన విజయ్‌ కుమార్‌ 60 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

రాజ్‌ విశ్వకర్మ (ఎన్‌ఎస్‌ఎస్‌ భోపాల్, 90 పాయింట్లు),  కలవ్య బాథమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ భోపాల్‌; 102 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గ్రీన్‌ ఫ్లీట్‌ ఈవెంట్‌ బాలికల విభాగంలో హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ సెయిలర్లే తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. సుప్రియ (55 పాయింట్లు), వైష్ణవి (74 పాయింట్లు), శ్రీహర్షిత (127 పాయింట్లు) మెరుగైన స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో ప్రవీణ్‌ (34 పాయిం ట్లు), నిఖిల్‌ (35 పాయింట్లు), మల్లేశ్‌  (36 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top