ఆకట్టుకున్న ప్రీతి, సిఖాన్షు సింగ్‌

Preeti Again Leads in Sailing Championsip - Sakshi

తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ప్రీతి కొంగర, సిఖాన్షు సింగ్‌ల ఆధిపత్యం కొనసాగుతోంది. హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో బుధవారం జరిగిన రేసుల్లో వీరిద్దరూ సత్తా చాటారు. వేగంగా వీస్తోన్న గాలులకు ప్రతికూల వాతావరణానికి ఎదురొడ్డి నిలిచి తమ తమ విభాగాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రెండో రోజు బుధవారం పోటీల అనంతరం సబ్‌ జూనియర్‌ ఆప్టిమిస్ట్స్‌ విభాగంలో 8 పాయింట్లతో ప్రీతి తొలి స్థానంలో కొనసాగుతోంది. ఎల్‌. ధరణి 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... ఎల్‌. ఝాన్సీ ప్రియ 27 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

బుధవారం జరిగిన నాలుగో రేసులో లక్ష్మీ నూకరత్నం విజేతగా నిలిచింది. ప్రీతి రెండో స్థానంతో ముగించింది. ఐదో రేసులో ప్రీతి, లక్ష్మి నూకరత్నం, ధరణి, ఝాన్సీ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఆరో రేసులో అంచనాలను తలకిందులు చేస్తూ ఝాన్సీ విజేతగా నిలవగా లక్ష్మి, ప్రీతి, ధరణి తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. జూనియర్‌ లేజర్‌ విభాగంలో టీఎస్‌సీకి చెందిన సిఖాన్షు సింగ్‌ 8 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. నిత్య బాలచందర్‌ (టీఎన్‌ఏఎస్‌) 17 పాయింట్లతో రెండో స్థానంలో, బి. కిరణ్‌ (టీఎస్‌సీ) 20 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు. జూనియర్‌ అండర్‌–18 ఫ్లీట్‌ విభాగంలో బుధవారం మొత్తం 7 రేసులు జరుగగా... సిఖాన్షు సింగ్‌ ఆరు రేసుల్లో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించాడు. మరో రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top