ధోని బలిదాన్‌ బ్యాడ్జ్‌పై పాక్‌మంత్రి ఫైర్‌

Pakistan Minister Targets MS Dhoni Over Army Crest on Gloves - Sakshi

ఇస్లామాబాద్‌ : మహేంద్రసింగ్‌ ధోని కీపింగ్‌ గ్లౌజ్‌పై ఉన్న ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్‌ ఆరంభపు మ్యాచ్‌లో ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అయితే ఈ లోగోతో ధోని తన దేశభక్తిని, ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని, భారత అభిమానులు, మీడియా కీర్తిస్తుంటే.. పాకిస్తాన్‌ మంత్రి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫెడరల్‌ మంత్రి అయిన ఫవాద్‌ చౌదరి ట్విటర్‌ వేదికగా ధోని చర్యను, భారత్‌ మీడియాను తప్పుబట్టాడు. ‘ ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి. వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్‌, రావండాకు పంపించాలి.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఇక అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఐసీసీ సైతం బలిదాన్‌ బ్యాడ్జ్‌పై అభ్యంతరం తెలిపింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (కమ్యూనికేషన్స్‌) ఫర్లాంగ్‌ వెల్లడించారు. ప్రత్యేక దళాల విలక్షణ చిహ్నమైన బలిదాన్‌ బ్యాడ్జ్‌.. పారాచూట్‌ రెజిమెంట్‌లో ఓ భాగం. రెండు కత్తులు కనిపించేలా ఉంటే ఈ చిహ్నంపై దేవనగరి లిపిలో బలిదాన్‌ అని రాసి ఉంటుంది. పారామిలిటరీ కమాండోలు మాత్రమే ఈ బ్యాడ్జ్‌ ధరించాడినికి అనుమతినిస్తారు. 2011లో ధోని పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top