ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధించిన పాక్‌

Pakistan Decided Not To Broadcast IPL Matches In Their Country - Sakshi

ఇస్లామాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2019 ప్రసారాలను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ తెలిపారు. ఈమేరకు.. ‘ రాజకీయాలను, క్రీడలను వేరుగా చూడాలని భావించాం.  కానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) జరిగిన సమయంలో భారత ప్రభుత్వం, కంపెనీలు పాక్‌ క్రికెట్‌ పట్ల ప్రవర్తించిన తీరు మాకు గుర్తుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’  అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఫిబ్రవరి 14న కశ్మీన్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు పీఎస్‌ఎల్‌ నాలుగవ సీజన్‌ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ భారత్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న కారణంగా.. భారత్‌లో పీఎస్‌ఎల్‌ ప్రసారాల్ని నిలిపివేస్తూ డీస్పోర్ట్‌ చానల్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ వెనువెంటనే పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది. ఇక పాక్‌ ప్రధాని, ఆ దేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రానున్న ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పీసీబీ.. బీసీసీఐ, భారత ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయాలని చూసింది. పుల్వామా ఘటనకు సంతాప సూచకంగా మిలిటరీ క్యా పులు ధరించినందుకు టీమిండియా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది కూడా.(టీమిండియాపై చర్యలు తీసుకోవాల్సిందే : పీసీబీ)

కాగా మరో రెండు రోజుల్లో ఇండియన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ 2019 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఈ నెల 23న జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లి మిస్టర్‌ కూల్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టు... టీమిండియా కెప్టెన్‌ కోహ్లి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో తలపడనుంది. ఇద్దరు దిగ్గజాల జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సీఎస్‌కే హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతుండగా... అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top