మా ఓటమికి వాళ్లే కారణం: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్
పుణె: టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడం వల్లే రెండో వన్డేలో తాము ఓడిపోయామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నారు. అదే సమయంలో భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రారంభంలోనే వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని అన్నారు.
'మా టాప్ ఆర్డర్ సరిగ్గా ఆడలేకపోయింది. భారత ఓపెనింగ్ బౌలర్లు చాలా బాగా ఆడారు. సరైన లెంథ్తో బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్ నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి' అని విలియమ్సన్ అభిప్రాయపడ్డారు. మొదటి వన్డే గెలుపు ఉత్సాహంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను రెండో వన్డేలో భారత్ కట్టడి చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 9 వికెట్లకు 230 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా అందుకున్న టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది.
'వీళ్ల (టీమిండియా)ను ఓడించాలంటే మేం మెరుగ్గా ఆడాలన్న విషయం మాకు తెలుసు. పిచ్ అంతా ఈజీగా లేదు. మేం ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చాం. ముంబైలో మంచి ప్రదర్శన ఇచ్చాం. (మూడో వన్డే జరిగే) కాన్పూర్లో మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నాం' అని మ్యాచ్ అనంతరం విలియమ్సన్ చెప్పాడు.
కివీస్ నిర్దేశించిన 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే టీమిండియా చేరుకున్న సంగతి తెలిసిందే. మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లాడి 9 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) సిరీస్ లో మరోసారి విఫలమైనా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (84 బంతుల్లో 68: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రమోషన్ పొందిన దినేశ్ కార్తీక్ (64 నాటౌట్) లు హాఫ్ సెంచరీలతో రాణించారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు