ఆ స్వార్థం నాకు లేదు: రహానే

Not A Selfish Guy Ajinkya Rahane - Sakshi

ఆంటిగ్వా: ‘ జట్టు కోసమే ఆలోచిస్తా. సెంచరీ కోసం కాదు. నేను స్వార్థ క్రికెటర్‌ని కాదు. సాధ్యమైనంత వరకూ క్రీజ్‌లో పాతుకుపోవడానికి యత్నిస్తా. జట్టు పరిస్థితిని బట్టి ఆటను మార్చుకుంటా’ అని భారత క్రికెటర్‌ అజింక్యా రహానే పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడ్డ సమయంలో రహానే 81 పరుగులతో ఆదుకున్నాడు. అయితే సెంచరీ చేసే అవకాశాన్ని చేజ్చార్చుకోవడంపై తొలి  రోజు ఆట ముగిసిన తర్వాత అడిగిన ప్రశ్నకు రహానే తనదైన శైలిలో బదులిచ్చాడు. తాను జట్టు ప్రయోజనాలను దృష్టిల్లో పెట్టుకుని ఆడతానని, అక్కడ సెంచరీ వస్తుందా.. లేదా అనేది ఆలోచించనని తెలిపాడు. అసలు మనం ఆడుతూ పోతే సెంచరీ అనేది సహజంగానే వస్తుందని, దాని కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదన్నాడు.

తాను సెంచరీ కోసం ఆలోచించే సెల్ఫిష్‌ గయ్‌ని కాదంటూ రహానే స్పష్టం చేశాడు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత జట్టు ఎదురీదుతున్న సమయంలో తాను చేసిన 81 పరుగులు ఎంతో విలువైనవని పేర్కొన్నాడు. జట్టు పరిస్థితి కుదుటపడితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నాడు.  వరల్డ్‌కప్‌లో చోటు కోల్పోయిన తర్వాత తాను కౌంటీ గేమ్‌ల్లో ఆడటంతో మరింత మెరుగయ్యాననిని పేర్కొన్నాడు. రెండు నెలల కాలంలో ఏడు కౌంటీ గేమ్స్‌ ఆడానని, దాంతో బ్యాటింగ్‌పై ఏకాగ్రత పెరిగిందన్నాడు. ప్రధానంగా ఇంగ్లండ్‌లో డ్యూక్‌ బాల్స్‌తో క్రికెట్‌ ఆడేటప్పుడు ప్రతీ బంతిని బాడీ లైన్‌ మీద ఆడాల్సి వస్తుందన్నాడు. తనకు కౌంటీల్లో ఆడటం ఎంతో కలిసొచ్చిందన్నాడు. మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించిందన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top