‘నంబర్వన్’ దక్కడం ఆనందంగా ఉంది: నాగార్జున
‘ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిని మేం సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ నంబర్ వన్ మనతో ఉండాలని గవాస్కర్ అన్నారు. ఆయన ఆలోచన ప్రకారమే మలేసియా ఆటగాడు లీ చోంగ్ వీ మాకు దక్కాడు’ అని ముంబయి మాస్టర్స్ ఫ్రాంచైజీ భాగస్వామి, సినీ హీరో అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్) ఆటగాళ్ల వేలంలో కుమారుడు నాగచైతన్యతో కలిసి పాల్గొన్న నాగార్జున అనంతరం మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు.
వేలం నిర్వహించిన విధానం బాగుందంటూ ఆయన అమిత సంతోషాన్ని వెలిబుచ్చారు. క్రికెట్లో కొత్త ఒరవడికి నాంది పలికిన ఐపీఎల్ని అనుకరిస్తున్నట్టు లేదా అని అడగ్గా నాగార్జున సమాధానమిస్తూ, ‘ఐపీఎల్ బాగా సక్సెస్ అయ్యింది. అలాంటి ఫార్మాట్ని అనుకరించడం తప్పేం కాదు కదా... ఐబీఎల్ మొదటి బిడ్డింగ్ బాగా జరిగింది. ఐపీఎల్ వచ్చాక క్రికెట్లో చాలామంది కొత్త కొత్త ఆటగాళ్లు తెరపైకి వచ్చారు. వాళ్లలో చాలామంది అంత క్రితం ఎవరికీ తెలియనివారే. ఇప్పుడు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లోనూ కొత్తవారికి చాలామందికి అవకాశం దక్కుతుంది. వారి ప్రతిభ మనకు తెలుస్తుంది’ అని అన్నారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ, బ్యాడ్మింటన్ ఆటపై చిన్నప్పటినుంచీ తనకెంతో ఆసక్తి అని, ఎప్పుడు టోర్నీలు జరిగినా ఇష్టంతో చూసేవాడినని, ఆ ఆసక్తితోనే ఇప్పుడు ఫ్రాంచైజీలో భాగస్వామినయ్యానని బదులిచ్చారు.
సంబంధిత వార్తలు