2019 ఎన్నికల్లో ధోనికే నా ఓటు!

MS Dhoni over Aamir Khan and Priyanka Chopra in 2019 elections, beauty pageant contestant wins hearts - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో ఎంఎస్‌ ధోని స్థానం ప్రత్యేకం. జట్టు ఎంతటి విపత్కర పరిస్థితులో ఉన్న సహనం కోల్పోకుండా ముందుండి నడిపించడం ధోనికి అలవాటు. ఇదే ధోనికి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.  2007లో భారత్‌కి టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌ని అందించిన ధోని.. సుదీర్ఘకాలం టీమిండియాని విజయపథంలో నడిపించాడు.  ఈ క‍్రమంలోనే మిస్టర్‌ కూల్‌ ముద్రను ధోని సంపాదించుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ పదవి నుంచి ధోని తప్పుకున్నా.. ఇప్పటికీ అతనికి ఉన్న ఆదరణ చెక్కుచెదరలేదు. భారత్‌లోని చాలా మంది సెలబ్రిటీలు కూడా ధోని అభిమానులే. తాజాగా ‘మిస్ దివా’ ఫైనల్‌ పోటీలో ఓ ముద్దుగుమ్మ సైతం ధోనికే ఓటు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

‘యమహా ఫాస్కినో మిస్‌ దివా 2018’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన రోష్ని షిరాన్‌.. జార్ఖండ్‌ డైనమేట్‌ ధోనికే ఓటేశారు. మిస్ దివా ఫైనల్లో పోటీదారుల పరిణతిని పరీక్షించడంలో భాగంగా ‘ప్రశ్న- జవాబు’ రౌండ్‌ని నిర్వహించారు. అందులో ‘2019 ఎన్నికల్లో ఆమీర్ ఖాన్, ధోని, ప్రియాంక చోప్రా, రతన్‌జీ టాటా, బాబా రాందేవ్ పోటీపడితే.. నువ్వు ఎవరికి ఓటు వేస్తావు..? ఎందుకు..?’ అనే ప్రశ్న అడిగారు. దీనికి కాస్త సమయం తీసుకున్న ఆ ముద్దుగుమ్మ ధోనినే తన ఆప్షన్‌గా ఎంచుకుంది.

‘గొప్ప నాయకుడి లక్షణాలు ఎంఎస్‌ ధోనికి ఉన్నాయి. అంతకంటే ముందు అతను కెప్టెన్ కూల్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోడు. ఇక రెండోది సహచర ఆటగాళ్లని ప్రోత్సహిస్తూ వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడతాడు. అది అతని టీమ్ వర్క్‌కి నిదర్శనం. మూడోది.. ధోనీ ఎప్పుడూ ఇతరులకి సాయం చేసేందుకు ముందుంటాడు’ అని రోష్ని షిరాన్‌ పేర్కొన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top