'ధోనిని ఒత్తిడిలోకి నెట్టకండి'
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ మరోసారి మద్దతుగా నిలిచారు. ప్రస్తుత భారత జట్టులో ధోని చాలా విలువైన ఆటగాడని, దయచేసి అతన్ని ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేయొద్దంటూ సెలక్షన్ కమిటీకి గంగూలీ హితవు పలికారు. కీలక సమయాల్లో ఇప్పటికే ఎన్నోసార్లు తనమేటో నిరూపించుకుని జట్టుకు అపూర్వమైన విజయాలు అందించిన ధోనికి 'పరీక్ష' పెట్టవద్దని సెలక్టర్లకు సూచించారు.
'సుదీర్ఘ కాలంగా భారత జట్టులో ధోని కీలక పాత్ర పోషిస్తున్నాడు. మూడొందల వన్డే మ్యాచ్ లు ఆడిన అనుభవం ధోని సొంతం. ధోని కెరీర్ లో ఎన్నో ఘనతల్ని సాధించి పెట్టాడు. శ్రీలంకతో సిరీస్ కు ముందు ధోనిని పరీక్షిస్తున్నాం అంటూ చెప్పడం ఎవరికైనా తగదు. ఆ తరహా ఆటగాళ్లకు పరీక్ష అనేది ఉండదు. ఆ రకంగా చేస్తే వార్ని మరింత ఒత్తిడిలోకి నెట్టినట్లే అవుతుంది. ధోని రికార్డులే అతను ఏమి చేసాడో చెబుతాయి. ధోని వంటి కీలక ఆటగాడి అనుభవాన్ని ఉపయోగించే యత్నం మాత్రమే చేద్దాం'అని గంగూలీ పేర్కొన్నాడు.
సంబంధిత వార్తలు