ధోని.. ఈసారి ఎయిర్ పోర్ట్లో!
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేద తీరాలంటే చుట్టు ఉన్న పరిస్థితుల్ని పెద్దగా పట్టించుకోడనే విషయం మరోసారి రుజువైంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ లో ధోని మైదానంలో పడుకుని రిలాక్స్ అయ్యాడు. శ్రీలంక ఓడిపోతున్న సమయంలో ఆ దేశ అభిమానులు ఓటమిని జీర్ణించుకోలేక బాటిల్స్ విసిరి ఆందోళనకు దిగారు. అప్పుడు కాసేపు ధోని మైదానంలోనే సేద తీరాడు. ఒకవైపు రోహిత్ శర్మ ఆందోళనతో స్టేడియం వైపు చూస్తుండగా, ధోని మాత్రం 'కూల్' గా రిలాక్స్ అయ్యాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
తాజాగా ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన తొలి వన్డే ముగిసిన తరువాత భారత ఆటగాళ్లు కోల్ కతా కు పయనమయ్యే సమయంలో ధోని ఎయిర్ పోర్ట్లోనే తన నడుం వాల్చాడు. చెన్నై విమానశ్రయంలో టీమిండియా జట్టు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఆటగాళ్లందరూ అక్కడే కూర్చోగా, ధోని మాత్రం ఫ్లోర్పై హాయిగా పడుకున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తొలి వన్డేలో విజయం సాధించి ఆధిక్యంలో నిలిచిన టీమిండియా జట్టు ఎలా రిలాక్స్ అవుతుందో చూడండి అంటూ ఫోటోతో కూడిన కామెంట్ ను జోడించింది.
That is how you relax after taking a 1-0 lead. #TeamIndia #INDvAUS pic.twitter.com/EiCH9ruPep
— BCCI (@BCCI) 18 September 2017