అందువల్లే ఓడిపోయాం: ధావన్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా పరాజయం చెందడానికి తమ పేలవమైన ఫీల్డింగే కారణమని ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. రెండు కీలక క్యాచ్లను జారవిడచడంతో పాటు ఒక రనౌట్ చాన్స్ను కూడా మిస్ చేసుకోవడం వల్లే ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషించాడు. మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ.. ‘ మ్యాచ్ ఆద్యంతం బాగా జరిగింది. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్ ద్వారా మేము ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాం. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, మేము ఆడిన తీరు తదుపరి మ్యాచ్కు బాగా ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నాం. ఇది మేము గెలవాల్సిన మ్యాచే. కానీ ఫీల్డింగ్లో చేసిన కొన్ని తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాం. క్యాచ్లను డ్రాప్ చేయడం, రనౌట్ చాన్స్ను వదులుకోవడమే ఓటమికి కారణం. వాటిని మేము సద్వినియోగం చేసుకుని ఉంటే ఆసీస్ స్కోరు బోర్డుపై కొన్ని అదనపు పరుగుల్ని తగ్గి ఉండేవి. ఏది ఏమైనా ఒక మంచి గేమ్ ఆడాం’ అని ధావన్ తెలిపాడు.
బుధవారం ఆసీస్తో జరిగిన టీ20 మ్యాచ్ నాల్గో ఓవర్లో అరోన్ ఫించ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను కోహ్లి వదిలివేయగా, మార్కస్ స్టోనిస్ క్యాచ్ను ఖలీల్ అహ్మద్ జారవిడిచాడు. మ్యాక్స్వెల్ను రనౌట్ చేసే అవకాశాన్ని కూడా టీమిండియా చేజార్చుకుంది. దాంతో భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్పై విమర్శల వర్షం కురుస్తోంది.
సంబంధిత వార్తలు