కోహ్లికి లైఫ్.. నిరాశలో కివీస్!
ముంబై: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆచితూచి ఆడుతోంది. ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వికెట్లను కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ కు కెప్టెన్ విరాట్ కోహ్లి మరమ్మత్తులు చేపట్టాడు. అయితే కోహ్లి 29 వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అతనికి లైఫ్ లభించింది. న్యూజిలాండ్ బౌలర్ గ్రాండ్ హోమ్ వేసిన 19 ఓవర్ నాల్గో బంతికి కోహ్లి కవర్స్ లో ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను సాంత్నార్ వదిలేశాడు. ఒకవేళ కోహ్లి క్యాచ్ ను పట్టి ఉంటే భారత జట్టు మరింత ఒత్తిడిలోకి వెళ్లేది. భారత జట్టులో కోహ్లి కీలక ఆటగాడు కావడంతో అతనిచ్చిన క్యాచ్ ను వదిలేయడం కివీస్ శిబిరాన్ని నిరాశకు గురి చేసింది.
అంతకుముందు ధావన్(9), రోహిత్ (20), జాదవ్(12)లు పెవిలియన్ కు చేరారు. రోహిత్, ధావన్ లు ముందుగానే పెవిలియన్ కు చేరగా, ఆపై జాదవ్-కోహ్లిల జోడి ఇన్నింగ్స్ ను నడిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ 42 పరుగులు జోడించిన తరువాత జాదవ్ మూడో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో 71 పరుగుల వద్ద భారత్ మూడు వికెట్ ను కోల్పోయింది. అటు తరువాత తనకిచ్చిన లైఫ్ ను చక్కగా ఉపయోగించుకున్న విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.