కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి!

Kohli, Bumrah set to be rested for West Indies limited overs leg - Sakshi

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లతో పాటు టెస్టు సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే విండీస్‌తో సిరీస్‌లో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉంది. వీరిద్దరూ వరుసగా భారత్‌కు మ్యాచ్‌లు ఆడుతూ ఉండటంతో వర్క్‌లోడ్‌ ఎక్కువగా పడుతుందనే బోర్డు భావిస్తోంది. దాంతో కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక బీసీసీఐ సీనియర్‌ అధికారి ధృవీకరించారు.

‘ వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కోహ్లితో పాటు బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నాం. వీరిద్దరికీ టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ల నుంచి విరామం ఇస్తే తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఆసీస్‌తో సిరీస్‌ అయిన దగ్గర్నుంచీ కోహ్లి వరుసగా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. అదే సమయంలో బుమ్రాపై పనిభారం కూడా ఎక్కువగానే ఉంది. దాంతో వారికి విశ్రాంతి అవసరం. టెస్టు సిరీస్‌ నాటికి వారు అందుబాటులోకి వస్తారు’ అని సదరు బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం వరల్డ్‌కప్‌ ఆడుతున్న పలువురు భారత ఆటగాళ్లకు విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆగస్టు 3వ తేదీ నుంచి భారత్‌-విండీస్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top