గంగూలీ-సచిన్‌ల రికార్డు బ్రేక్‌

Kohli And Rahane Surpass Sachin And Ganguly Record - Sakshi

ఆంటిగ్వా:  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు.  టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో  జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో  ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని జత చేశారు. ఫలితంగా భారత్‌ తరఫున అత్యధిక సార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా కొత్త రికార్డు నమోదు చేసింది.

ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ-సచిన్‌ టెండూల్కర్‌ల రికార్డును కోహ్లి-రహానేలు బ్రేక్‌ చేశారు.  నాల్గో వికెట్‌కు గంగూలీ-సచిన్‌లు ఏడుసార్లు సెంచరీ భాగస్వామ్యాల్ని సాధించగా, కోహ్లి-రహానేలు దాన్ని సవరిస్తూ ఎనిమిదో సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. భారత్‌ తరఫున టెస్టు ఫార్మాట్‌లో నాల్గో వికెట్‌కు అత్యధికసార్లు వంద పరుగులు భాగస్వామ్యాల్ని సాధించిన జోడిల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లి-రహానే, గంగూలీ-సచిన్‌ల జోడి ఉండగా, ఆపై మూడో స్థానంలో మహ్మద్‌ అజహరుద్దీన్‌-సచిన్‌ల జోడి(ఆరుసార్లు) ఉంది.  విండీస్‌తో రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రహానే(53 బ్యాటింగ్‌), కోహ్లి(51 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top