అదొక చేదు జ్ఞాపకం: కేఎల్ రాహుల్
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరీస్ ద్వారా తిరిగి ఫామ్ను నిరూపించుకున్నాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. తొలి టీ20లో 50 పరుగులు చేసిన రాహుల్.. రెండో మ్యాచ్లో 47 పరుగులు సాధించాడు. గత నెలలో ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్.. ఆ వివాదం తర్వాత భారత్ తరఫున ఆడిన తొలి సిరీస్ ఇదే.
ఆ వివాదానికి సంబంధించి మరోసారి మాట్లాడిన కేఎల్ రాహుల్.. అదొక క్లిష్ట సమయంగా పేర్కొన్నాడు. ‘అది నా కెరీర్లో చాలా కష్ట సమయం. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. అలానే నేను కూడా ఒక కఠినమైన పరిస్థితిన చవిచూశాను. ఆ వివాదం తర్వాత నేను జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ప్రతీ ఒక్క క్రికెటర్కు దేశం తరఫున ఆడాలనే కోరిక ఉంటుంది. ఇక్కడ నేను వేరు కాదు. నాకు కూడా దేశానికి సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి విజయాల్లో పాలు పంచుకోవాలనేదే నా కోరిక. నేను ఎక్కడ ఉన్నానో, జట్టులో నాకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలుసు. నాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడమే నా పని. తలవంచుకుని నాకు అప్పగించిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే నా ముందున్న లక్ష్యం’ అని రాహుల్ అన్నాడు.
సంబంధిత వార్తలు