చెలరేగిన ఇషాంత్‌

 Ishant Puts India On Top Against West Indies - Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ చెలరేగిపోయాడు. పదునైన బంతులతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఫలితంగా వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 189 పరుగులే చేసిన విండీస్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దాంతో ప్రస్తుతం టీమిండియా 108 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ పూర్తి కావడానికి రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో భారత్‌కు మ్యాచ్‌పై పట్టుదొరికినట్లే.

విండీస్‌ ఆటగాళ్లలో రోస్టన్‌ ఛేజ్‌(48), హెట్‌మెయిర్‌(35)లు మాత్రమే మోస్తరుగా రాణించారు. తొలుత ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ను పెవిలియన్‌కు పంపిన ఇషాంత్‌.. ఆపై మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. రోస్టన్‌ ఛేజ్‌, షాయ్‌ హోప్‌, హెట్‌ మెయిర్‌ వికెట్లను సాధించి విండీస్‌ పతనాన్ని శాసించాడు.  రెండో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కీమర్‌ రోచ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు.  తద్వారా ఐదు వికెట్లను ఇషాంత్‌ సాధించాడు. టెస్టుల్లో ఇషాంత్‌ ఐదు వికెట్లను నేలకూల్చడం ఇది తొమ్మిదోసారి. కాగా, వెస్టిండీస్‌ గడ్డపై ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను(10 వికెట్లలోపు) తీయండ మూడోసారి. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో  297 పరుగులకు ఆలౌటైంది. వీంద్ర జడేజా (112 బంతుల్లో 58), రహానే (81; 10 ఫోర్లు)లు ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top