వేసవిలో పరుగుల వర్షం
వన్డే ప్రపంచ కప్ మధురస్మృతులు మదిలో మెదులుతుండగానే.. మండు వేసవిలో పరుగుల వర్షంతో ముంచెత్తడానికి పొట్టి క్రికెట్ పండగ వచ్చేసింది. ఐపీఎల్ 8వ సీజన్ 47 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో అభిమానులను కనువిందు చేయనుంది. పోటీలు బుధవారం లాంఛనంగా ప్రారంభమవుతాయి.
కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరుగుతుంది. కోల్కతాకు గంభీర్, ముంబైకి రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. ఐపెఎల్-8లో మొత్తం 8 జట్లు బరిలో దిగుతున్నాయి. కోల్కతా, ముంబైతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో మ్యాచ్లు జరగనున్నాయి.