రఫ్పాడించిన రాయుడు.. మెరిసిన పాండ్యా
కివీస్ లక్ష్యం 253
తృటిలో శతకం చేజార్చుకున్న హైదరాబాదీ బ్యాట్స్మెన్
5 సిక్సర్లతో కసిగా ఆడిన పాండ్యా
బాధ్యతాయుతంగా రాణించిన శంకర్, జాదవ్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్మన్ అంబటి రాయుడు (90: 113 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపులు తోడవ్వడంతో ఆతిథ్య జట్టుకు 253 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్సేనను కివీస్ పేసర్ ద్వయం హెన్రీ, బౌల్ట్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(2), శిఖర్ ధావన్ (6)లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చిన ఈ పేసర్ ద్వయం అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్(7), ధోని(1)లను వరుస ఓవర్లలో వెనక్కి పంపింది. ఈ దెబ్బకు 18 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. దీంతో నాలుగో వన్డే వైఫల్యమే పునరావృతం అవుతుందా అని అందరూ భావించారు.
గట్టెక్కించిన రాయుడు-శంకర్
ఈ కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన యువ ఆల్రౌండర్ విజయ్ శంకర్తో అంబటి రాయుడు ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రోహిత్ సేనను గట్టెక్కించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన విజయ్ శంకర్(45: 64 బంతులు, 4 ఫోర్లు) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాదవ్తో రాయుడు ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ దశలో రాయుడు 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో కెరీర్లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి చేరువయ్యే క్రమంలో అనవసర షాట్తో రాయుడు(90) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దీంతో ఆరో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో 13 పరుగుల వ్యవధిలో జాదవ్ (34: 45 బంతుల్లో, 3ఫోర్లు)ను హెన్రీ బౌల్డ్ చేశాడు.
కసి కసిగా.. పాండ్యా!
అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్యా వచ్చి రావడంతోనే కసిగా ఆడాడు. ముఖ్యంగా అస్లే వేసిన 47 ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లతో చెలరేగాడు. వచ్చిన బంతి వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 45 పరుగులు చేసిన పాండ్యా.. మరో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేధం ఎదుర్కొన్న పాండ్యా.. ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా ఏంటో చూపించి జట్టుకు తన అవసరం ఏంటో గుర్తు చేశాడు. చివర్లో భువన్వేశర్ (6) క్యాచ్ ఔట్గా, షమీ(1) రనౌట్గా వెనుదిరిగడంతో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. చహల్ నాటౌట్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ నాలుగు, బౌల్ట్ మూడు వికెట్లతో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. నిషామ్కు ఒక వికెట్ దక్కింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు