చివరి పది ఓవర్లలో భారత్ ఇలా..
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ కడవరకూ బ్యాటింగ్ చేసి కోల్పోయిన వికెట్లు 7. అయితే ఇందులో నాలుగు వికెట్లను ఆఖరి పది ఓవర్లలోనే భారత్ నష్టపోయింది. ఇన్నింగ్స్ 40 ఓవర్ ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 219 పరుగులతో పటిష్టంగా కనిపించిన విరాట్ గ్యాంగ్ స్లాగ్ ఓవర్లలో దారుణంగా వైఫల్యం చెందింది. చివరి పది ఓవర్లలో సఫారీ బౌలర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా చతికిలబడింది. కేవలం ఇన్నింగ్స్ ఆఖరి పది ఓవర్లలో భారత్ సాధించిన పరుగులు 55. అందులో నాలుగు ఫోర్లు మాత్రమే ఉండగా, సిక్సర్ల ఊసే లేదు. ఇక 22 డాట్ బాల్స్ పడ్డాయి.
మ్యాచ్ 41 ఓవర్లో 11 పరుగులు రాగా, 42 ఓవర్లో 6, 43 ఓవర్లో 0, 44 ఓవర్లో 2, 45 ఓవర్లో 2, 46 ఓవర్లో 6, 47 ఓవర్లో 8, 48 ఓవర్లో 7, 49 ఓవర్లో 8, 50 ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. దాంతో భారత జట్టు మూడొందలకు పైగా పరుగులు చేస్తుందనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రధానంగా లుంగీ ఎన్గిడి విజృంభించడంతో భారత్ వరుసగా వికెట్లను నష్టపోయింది. ఎన్గిడి సాధించిన నాలుగు వికెట్లు చివరి పది ఓవర్లలో సాధించినవే కావడం అతని కట్టుదిట్టమైన బౌలింగ్కు నిదర్శనం.
మరిన్ని వార్తలు