రోహిత్‌-రాహుల్‌ అదుర్స్‌

Ind vs WI: Rohit And Rahul Gets Half Centuries - Sakshi

విశాఖ: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు మెరిశారు. వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌-రాహుల్‌లు ఆరంభించారు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.

మంచి బంతుల్ని ఆచితూచి ఆడుతూ చెత్త బంతుల్ని బౌండరీలు దాటించారు. ఈ క్రమంలోనే తొలుత రాహుల్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు.  ఇది రాహుల్‌కు వన్డేల్లో ఐదో హాఫ్‌ సెంచరీ. ఆపై కాసేపటికి రోహిత్‌ సైతం హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం సాధించాడు. ఫలితంగా ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగుల్ని సాధించాడు. ఇక్కడ కోహ్లిని రోహిత్‌ వెనక్కి నెట్టాడు. అయితే 2019లో అత్యధిక వన్డే పరుగులు రికార్డు రోహిత్‌-కోహ్లిల మధ్య దోబుచులాడుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా ఆడుతుండటంతో రోహిత్‌ను కోహ్లి దాటి వేసే అవకాశం ఉంది. 22 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌  నష్టపోకుండా 121 పరుగులు చేసింది.

రోహిత్‌-రాహుల్‌లు నాల్గో సారి..
వన్డేల్లో రోహిత్‌ శర్మ-రాహుల్‌లు  వంద పరుగులకు పైగా ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని సాధించడం ఇది నాల్గో సారి. ఈ మ్యాచ్‌కు ముందు మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  వీరిద్దరూ 136 పరుగులు నమోదు చేయగా, బంగ్లాదేశ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 180 పరుగులు చేశారు. శ్రీలంకతో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ జోడి 189 ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top