'ధోని విషయం బాధించింది'

'ధోని విషయం బాధించింది'


న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్సీ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించడం తనను తీవ్రంగా బాధించిందని అంటున్నాడు గుజరాత్ లయన్స్  కెప్టెన్ సురేశ్ రైనా. ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తిని ఉన్నపళంగా తప్పించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. ఇది తానొక్కడ్నే అంటున్న మాట కాదని, యావత్ ప్రపంచం అంటున్న మాటని రైనా పేర్కొన్నాడు.


 


'ధోనిని కెప్టెన్సీ పదవి నుంచి తీసేస్తూ పుణె యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నన్ను నిరాశకు గురి చేయడమే కాదు.. బాధించింది కూడా. దేశానికి ధోని చాలా చేశాడు.  జాతీయ క్రికెట్ జట్టుకు ఎంత సేవ చేశాడో, అదే స్థాయిలో ఐపీఎల్ పురోగతికి దోహదపడ్డాడు. క్రికెట్ కు ఎంతో చేసిన వ్యక్తికి కచ్చితంగా గౌరవం ఇవ్వాలి' అని రైనా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా గతంలో ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం  వహించిన మధుర క్షణాల్ని రైనా గుర్తు చేసుకున్నాడు. తాను చెన్నై సూపర్ కింగ్స్ తో గడిపిన క్షణాలు ఎప్పటికీ ప్రత్యేకమేనని రైనా తెలిపాడు. చెన్నై తరపున అనేక ట్రోఫీలను అందుకున్నామని,అప్పడు యువ క్రికెటర్ గా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top