క్రికెట్ ఆడితే చంపేస్తామంటున్నారు!
చంఢీగర్: తనను క్రికెట్ ఆడకుండా అడ్డుకుంటున్న సోదరులపై చర్యలు తీసుకోవాలంటూ హరియాణా రాష్ట్రంలోని దెవ్రూ గ్రామానికి చెందిన ఓ యువతి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. క్రికెట్ అనేది తనకు ఎంతో ఇష్టమని ఫిర్యాదులో పేర్కొన్న సదరు యువతి.. ఆ క్రీడకకు సంబంధించి సోదరుల నుంచి సహకారం లేకపోగా తనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తోంది. ఈ మేరకు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సోనిపేట సదార్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి దల్విర్ సింగ్ వివరాలు వెల్లడించారు.
'ఆ యువతి మాకు తొలిసారి ఫిర్యాదు చేసినప్పుడు సోదరుల నుంచి క్రికెట్ ఆటకు ఆటంకం కల్గుతుందని పేర్కొంది. సోదరుల నుంచి తీవ్రమైన బెదిరింపులను ఆమె ఎదుర్కొన్నట్లు మాకు స్పష్టం చేసింది. దీనిపై ఆ అమ్మాయి సోదరులతో మాట్లాడాం. ఆమె క్రికెట్ ఆడే క్రమంలో బెదిరించవద్దని వారికి చెప్పాం. అదే సమయంలో చదువుకు కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వారికి సూచించాం.
అయితే వారు మాత్రం మమ్మల్ని కూడా హెచ్చరించారు. ఇది కుటుంబ వ్యవహారమని, ఇందులో తలదూర్చవద్దన్నారు. అక్కడ వారికి సర్దిచెప్పి వచ్చేశాం. కాగా, వారు మాత్రం ఆ యువతిని బెదిరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి నుంచి మాకు ఫోన్ వచ్చింది. తనకు ప్రాణహాని ఉందని ఫోన్ లో వాపోయింది. దాంతో ఆమె సోదరులపై క్రిమినల్ కేసు బుక్ చేశాం'అని దల్విర్ సింగ్ తెలిపారు. ఇందులో ఆమె అన్నయ్య రాష్ట్ర హెం గార్డు విభాగంలో ఉద్యోగి కాగా, తమ్ముడు ఇంకా చదువుకున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు