నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్షిప్ మూడో సీజన్ పోటీలు నేటి నుంచి జరుగనున్నాయి. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్జీసీ) వేదికగా ఈనెల 19 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు హైదరాబాద్ గోల్ఫ్ సంఘం (హెచ్జీఏ) బుధవారం ప్రకటించింది. ఇందులో శ్రీలంక, ఆస్ట్రేలియా, భారత్లకు చెందిన మొత్తం 126 మంది ప్రముఖ గోల్ఫర్లు తలపడతారు.
నగరానికి చెందిన ప్రొఫెషనల్ గోల్ఫర్ హైదర్ హుస్సేన్తో పాటు ఆరుగురు అమెచ్యూర్ క్రీడాకారులు అనంత శ్రీధర్ రెడ్డి, సి. రోహన్ రెడ్డి, కె. శశిధర్ రెడ్డి, హార్దిక్ చౌడ, రాహుల్ అజయ్, సంకీర్త్ నిడదవోలు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్జీఏ అధ్యక్షులు జె. విక్రందేవ్ రావు ఈ టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్లోని టాప్ గోల్ఫ్ క్రీడాకారులందరూ తలపడే ఈ టోర్నీకి నగరం ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు.
అంతకుముందు జరిగిన ప్రొఫెషనల్ గోల్ఫ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ప్రొఫెషనల్ అజీతేశ్ సంధు (చండీగఢ్) జట్టుకు ఆయన ట్రోఫీలను బహూకరించారు. అజయ్ రెడ్డి, అగస్త్య రెడ్డి, సంజయ్ రెడ్డిలతో కూడిన అజీతేశ్ సంధు జట్టు 51.8 పాయింట్లు స్కోరు చేసి ఈ ఈవెంట్లో విజేతగా నిలిచింది. 52 పాయింట్లను స్కోరు చేసిన ముఖేశ్ కుమార్ జట్టు రన్నరప్గా నిలిచింది.