అప్పుడు మేం.. ఇప్పుడు కోహ్లి సేన: గంగూలీ
లండన్: లార్డ్స్ మైదానంలో జరగబోయే రెండో వన్డేలో కోహ్లిసేన విజయం సాధిస్తుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఇదే మైదానంలో నాట్వెస్ట్ సిరీస్ను ఎలా గెలిచామో.. కోహ్లి సేన కూడా నేటి మ్యాచ్ను గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు.
ఇండియా టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘2002 జులై 13న లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్పై మేము ఎలాగైతే నాట్వెస్ట్ సిరీస్ సొంతం చేసుకున్నామో... సరిగ్గా అలాగే కోహ్లి సేన ఈ రోజు అదే మైదానంలో అదే ఇంగ్లాండ్పై విజయం సాధించి ఈ సిరీస్ కైవసం చేసుకుంటుంది. ప్రస్తుత పర్యటనలో కోహ్లి సేన ఇంగ్లండ్తో మూడు టీ20లు, ఒక వన్డేతో కలిపి మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడింది. మూడు మ్యాచ్ల్లో భారత్దే పూర్తి ఆధిపత్యం. ఇందులో ఏ ఒక్క మ్యాచ్లోనూ ఇంగ్లండ్కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రతి మ్యాచ్లోనూ ఒక బ్యాట్స్మన్ శతకం సాధించాడు. మిగతా వాటి కంటే కార్డిఫ్ పిచ్ కాస్త భిన్నం. ఇప్పటికైనా ఇంగ్లండ్ మేల్కోవాలి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే మరో మ్యాచ్లో భారత్దే పూర్తి ఆధిపత్యం అవుతుంది.’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్పై గంగూలీ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే నేడు మధ్యాహ్నం 3.30కు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండో సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఎలాగైనా రెండో వన్డేలో గెలిచి సిరీస్ను కాపాడుకోవాలని భావిస్తోంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు