వీబీ చంద్రశేఖర్‌ కన్నుమూత 

Former Indian Cricketer VB Chandrasekhar Passed Away - Sakshi

సాక్షి, చెన్నై : భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్‌కు సుదీర్ఘ కాలం  మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్‌ (వీబీ) చంద్రశేఖర్‌ గుండెపోటుతో గురు వారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. 1988–90 మధ్య భారత్‌ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్‌ మొత్తం 88 పరుగులే చేయడంతో స్థానం కోల్పోయి మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. అతడి 11 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ మాత్రం బాగా సాగింది. తమిళనాడు ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన వీబీ 81 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో  43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. దూకుడైన ఆటకు గుర్తింపు పొందిన చంద్రశేఖర్‌ 1988–89 ఇరానీ కప్‌ మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పట్లో భారత్‌ తరఫున అదే ఫాస్టెస్ట్‌ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ. రిటైర్మెంట్‌ అనంతరం 2012లో తమిళనాడు కోచ్‌గా, భారత సెలక్టర్‌గా  పనిచేసిన ఆయన... ఐపీఎల్‌ టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి ధోనిని తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కామెంటేటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్‌ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top