టీమిండియా చేజారిపోతున్న మ్యాచ్!
చేతిదాకా అందిన ముద్ద నోటికాడికి రాకపోవడం అంటే ఇదేనేమో! మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ను మైఖేల్ క్లార్క్ 290 పరుగుల వద్దే ఎందుకు డిక్లేర్ చేశాడో ఇప్పుడు అర్థమవుతోంది. తొలి టెస్టు చివరిరోజు పిచ్ తీరు అనూహ్యంగా మారిపోయింది. విపరీతంగా స్పిన్ తిరగడంతో లియాన్ టీమిండియా వెన్ను విరిచాడు. అరివీర భయంకరంగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా ఆరుగురు భారత బ్యాట్స్మన్ను పెవిలియన్ బాట పట్టించాడు. దాదాపుగా భారత జట్టు చేతి నుంచి విజయాన్ని లాగేసుకునేలా ఉన్నాడు. ఒక దశలో పటిష్ఠంగా ఉందనుకున్న భారత బ్యాటింగ్ లైనప్.. మురళీ విజయ్ 99 పరుగుల వద్ద ఔటయినప్పటి నుంచి పేకమేడలా కుప్పకూలిపోయింది. మేటి బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, మొదటి ఇన్నింగ్స్లో 62 పరుగులతో ఆకట్టుకున్న అజింక్య రహానే కూడా సింగిల్ డిజిట్లకే బ్యాట్ చంకలో పెట్టుకుని వెళ్లిపోయారు.
విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా, చివరకు లియాన్ బౌలింగులోనే భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద వార్నర్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత పోరు దాదాపుగా ముగిసినట్లే అయ్యింది. ఇక విజయం మాట అటుంచి.. ఉన్న మూడు వికెట్లను కాపాడుకుంటే చాలనే పరిస్థితి ఏర్పడింది. 98 ఓవర్లు సాగాల్సిన చివరి రోజు మ్యాచ్లో వికెట్ పడకుండా చూసుకొమ్మని సహచరుడు కరణ్ శర్మకు చెప్పి.. చాలా బాధతో నిండిన హృదయంతో విరాట్ కోహ్లీ వెళ్లలేక వెళ్లలేక క్రీజ్ విడిచిపెట్టి వెళ్లాడు. 83 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కరణ్ శర్మ ఇంకా ఖాతా తెరవలేదు. మహ్మ ద్ షమీ మాత్రం 8 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 5 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇంకా 15 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాల్సి ఉంది.