అదే మా ఓటమికి కారణం: కోహ్లి

England put pressure on us, Kohli - Sakshi

కార్డిఫ్‌: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమి చెందడం పట్ల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఆరంభంలో కీలక వికెట్లను కోల్పోయిన కారణంగానే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచలేకపోయామన్నాడు. ప్రధానంగా తొలి ఆరు ఓవర్లలో 30 పరుగులు చేసి మూడు వికెట్లను చేజార్చుకోవడంతో తిరిగి తేరుకోలేకపోయామన్నాడు.

‘ మొదటి ఆరు ఓవర్లే మా ఓటమికి ప్రధాన కారణం. పవర్‌ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోవడమే మా కొంప ముంచింది. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో మాపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో పవర్‌ ప్లే పరుగులు రాకపోవడంతో చివరకు మంచి స్కోరును సాధించలేకపోయాం. ఇంకా 15 పరుగులు చేయాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే బాగానే ఆడాం. ఇంగ్లండ్‌ కూడా 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా కష్ట పడాల్సి వచ్చింది’ అని కోహ్లి పేర్కొన్నాడు.

శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా, దాన్ని ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top