శతకంతో ఒంటరి పోరాటం చేసినా..
వెల్లింగ్టన్:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్కు నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో విజయాన్ని సాధించి సిరీస్లో 2-1 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ప్రధానంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అజేయ శతకంతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
విలియమ్సన్ 143 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే అతనికి మరో ఎండ్లో తగినంత సహకారం లభించలేదు. మిగతా న్యూజిలాండ్ ఆటగాళ్లలో కోలిన్ మున్రో(49), సాంత్నార్(41)లు ఆకట్టుకున్నా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, రషీద్ తలో రెండు వికెట్లు సాధించగా, మొయిన్ అలీ మూడు వికెట్లతో మెరిశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 234 పరుగులు చేసింది.