కోహ్లి-ధావన్ల అరుదైన ఘనత
మరొక 'సెంచరీ'కొడితే రికార్డు బ్రేక్!
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్-విరాట్ కోహ్లిలు తమ ఫామ్ను కొనసాగిస్తున్నారు. శనివారం నాల్గో వన్డేలో వీరిద్దరూ వంద పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత ఒక సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఈ జోడి రెండో వికెట్కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడం ద్వారా ఎనిమిదో సారి ఆ మార్కును చేరి అత్యధికంగా సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత మాజీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ-రాహుల్ ద్రవిడ్ల సరసన నిలిచారు. ఓవరాల్గా వన్డే క్రికెట్లో దిల్షాన్-సంగక్కరా(19 సార్లు), హేడెన్-పాంటింగ్(10)లు రెండో వికెట్కు అత్యధికంగా సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో తొలిరెండు స్థానాల్లో ఉన్నారు.
శిఖర్-కోహ్లిల జోడి మరొక సెంచరీ భాగస్వామ్యం సాధిస్తే ద్రవిడ్-గంగూలీల రికార్డును బ్రేక్ చేస్తారు. సఫారీలతో గత వన్డేలో శిఖర్-కోహ్లిలు 140 పరుగుల భాగస్వామ్యాని సాధించిన సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్లో ధావన్ 65 పరుగులు, కోహ్లి 45 పరుగులు చేసిన తర్వాత సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ఇక కోహ్లి 56 బంతుల్లో ఐదు ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు 53 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో శిఖర్ అర్ధ శతకం నమోదు చేశాడు.
మరిన్ని వార్తలు